Photo Credit: Twitter
2026 ఆసియా క్రీడల కోసం జపాన్లోని నగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి సంబంధిత సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన ఘటన కలకలం రేపింది. అధికారిక వసతి కోసం క్రూయిజ్ షిప్కు చేరుకున్న సమయంలో నిర్వాహకులు వారిద్దరికీ ఒకే గదిని కేటాయించారు.
అథ్లెట్, కోచ్ ఒకే గదిలో ఉండేలా ఏర్పాట్లు చేయడంపై ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం కావడానికి గంటల సమయం పట్టింది.
భారత ఒలింపిక్ సంఘం (IOA) జోక్యంతో చివరకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రణతి, అశోక్ మిశ్రాకు వేర్వేరు గదులు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ అశోక్ మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. తనకు కేటాయించిన గది తాళాలు తీసుకునేందుకు వెళ్లగా, హోటల్ రిజిస్టర్లో తన బుకింగ్ కనిపించలేదని సిబ్బంది తెలిపారు. రికార్డుల్లో ఆయన పేరులోని ‘I’ అక్షరం తప్పిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు.
అధికారిక రికార్డుల్లో జరిగిన పొరపాటును సరిచేసి, అశోక్ మిశ్రా అక్రిడిటేషన్ను ధృవీకరించేందుకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో ఆయన తెల్లవారుజామున 2 గంటలు దాటిన తర్వాతే గదికి చేరుకుని విశ్రాంతి తీసుకోగలిగారు. ఈ ఘటనను ప్రణతి నాయక్ కూడా ధృవీకరించారు.
ఇదీ చదవండి: వ్యభిచారం చేసినందుకు మహిళకు వంద కొరడా దెబ్బలు!


