
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 18) జరిగిన మ్యాచ్లో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు) విరుచుకుపడ్డాడు.
ఈ లీగ్లో వాషింగ్టన్ ఫ్రీడంకు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
ఈ ఇన్నింగ్స్ అనంతరం మ్యాక్సీ ఆటతీరుపై వాషింగ్టన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. భారత క్రికెట్ అభిమానులకు మాత్రం రగిలిపోతున్నారు. మ్యాక్స్వెల్ తన సొంత దేశానికి (ఆస్ట్రేలియా) ఆడేటప్పుడు కాని, ఇతరత్రా లీగ్ల్లో ఆడేటప్పుడు కాని చెలరేగిపోతాడు. ఐపీఎల్కు వచ్చే సరికి మాత్రం తేలిపోతాడని మండిపడుతున్నారు.
మ్యాక్స్వెల్ ఐపీఎల్ ప్రదర్శనలను, ఇతర మ్యాచ్ల్లో ప్రదర్శనలతో పోలుస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాక్స్వెల్ ఐపీఎల్లో లభించే భారీ మొత్తాన్ని దిగమింగుతూ, తనలోని అత్యుత్తమ ప్రదర్శనలను మాత్రం ఇతర లీగ్ల్లో ఇస్తాడంటూ చీవాట్లు పెడుతున్నారు. మ్యాక్సీ ఓ మోసగాడంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు.
మ్యాక్స్వెల్ను ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ రూ. 4.2 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఈ మొత్తంలో కనిపించే సంఖ్యలకు సరిపడా పరుగులు కూడా చేయలేకపోయాడతను. మ్యాక్సీ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో 5 మ్యాచ్లు ఆడి కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.
అదే మేజర్ లీగ్ క్రికెట్ విషయానికొస్తే.. ఈ అమెరికన్ లీగ్లో అతను ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్ల్లోనే సెంచరీ సాయంతో 204 స్ట్రయిక్రేట్తో 149 పరుగులు చేశాడు. ఈ వ్యత్యాసాన్ని చూపించే భారత క్రికెట్ అభిమానులు మ్యాక్స్వెల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి భారత క్రికెట్ అభిమానులు మ్యాక్సీ ఆటతీరుపై గత రెండేళ్లుగా గుర్రుగానే ఉన్నారు. 2024 ఐపీఎల్ సీజన్లో మ్యాక్సీ ఆర్సీబీకి ఆడుతూ 10 మ్యాచ్ల్లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్లోనే భారత అభిమానులు అతనిపై తీవ్రస్థాయి ఆగ్రహ అందోళనలు వ్యక్తం చేశారు.
ఆ సీజన్లో ఆర్సీబీ అతనికి రికార్డు స్థాయిలో రూ. 11 కోట్ల మొత్తం చెల్లించింది. ఇంత డబ్బు తీసుకొని కనీస న్యాయం చేయకపోవడం అతనికి కూడా ధర్మం కాదు. మ్యాక్సీ ఐపీఎల్లో ఆడేటప్పుడు చాలా ఉదాసీనంగా కనిపిస్తాడు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు వచ్చానన్నట్లు ఫీలవుతాడు. వరుస అవకాశాలు ఇచ్చినా సక్సెస్ కాకపోతే గాయం పేరు చెప్పి మధ్యలోనే ఇంటికి చెక్కేస్తాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఇదే జరిగింది.