విధ్వంసకర శతకాలు.. పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు | Smith Gous Tons Washington Break PBKS World record In T20 Cricket | Sakshi
Sakshi News home page

విధ్వంసకర శతకాలు.. పంజాబ్‌ కింగ్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు

Jul 16 2026 11:45 AM | Updated on Jul 16 2026 12:28 PM

Smith Gous Tons Washington Break PBKS World record In T20 Cricket

శతక వీరులు గౌస్‌- స్మిత్‌ (PC: MLC X)

టీ20 ఫార్మాట్లో వాషింగ్టన్‌ ఫ్రీడం జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వాషింగ్టన్‌ ఫ్రీడం బద్దలు కొట్టింది.

అమెరికా వేదికగా మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ (MLC)-2026లో భాగంగా ఎంఐ న్యూయార్క్‌- వాషింగ్టన్‌ ఫ్రీడం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఒక్లాండ్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన వాషింగ్టన్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్‌.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 266 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

నికోలస్‌ పూరన్‌ విధ్వంసకర శతకం
న్యూయార్క్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ విధ్వంసకర శతకం సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 13 సిక్సర్లు బాది 106 పరుగులు రాబట్టాడు. కీరన్‌ పొలార్డ్‌ 25 బంతుల్లో 64 పరుగులు చేయగా.. క్వింటన్‌ డికాక్‌ 24 బంతుల్లో 51 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో ట్రెంట్‌ బౌల్ట్‌ 10 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారీ స్కోరు సాధ్యమైంది.

ఆకాశమే హద్దుగా
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్‌ జట్టు ఆదిలోనే ఓపెనర్‌ మిచెల్‌ ఓవెన్‌ (1) వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర (6) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆండ్రీస్‌ గౌస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి శతక్కొట్టారు.

స్మిత్‌ 48 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. గౌస్‌ కేవలం 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్లు బాది 132 పరుగులతో దుమ్ములేపాడు. వీరి ఆట ముందు విధ్వంసం అన్న పదం కూడా చిన్నబోయింది.

స్మిత్‌, గౌస్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా వాషింగ్టన్‌ ఫ్రీడం కేవలం 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 270 పరుగులు చేసింది. తద్వారా న్యూయార్క్‌ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఇక న్యూయార్క్‌ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిపోయింది.

పంజాబ్‌ కింగ్స్‌ రికార్డు బద్దలు
ఐపీఎల్‌-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ఛేదించిన సంగతి తెలిసిందే. తద్వారా పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును వాషింగ్టన్‌ ఫ్రీడం బద్దలు కొట్టింది. ఏకంగా 267 పరుగుల టార్గెట్‌ పూర్తి చేసింది. ఛేజింగ్‌లో మొత్తంగా 270 పరుగులు సాధించింది.

చదవండి: ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement