
ఐసీసీ చైర్మన్ జై షా పై గంగూలీ ప్రశంసలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 2019 నుంచి 2022 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో జై షా బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న జై షా నిజాయితీ, పట్టుదల తనను ఎంతో ఆకట్టుకున్నాయని గంగూలీ పేర్కొన్నాడు.
‘అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జై షా చాలా ప్రత్యేకం. అతడు భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించాడు. రాజకీయ నేపథ్యం నుంచి రావడంతో అతడి నిర్ణయాల్లో మొండితనం, ఓరకమైన దృఢత్వం ఉంటుందని ఆశించా. కానీ అందుకు భిన్నమైన తీరుతో నిజాయితీ, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తాడు. దీన్ని మరింత మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టొచ్చా అని మార్గాలు వెతుకుతుంటాడు’ అని గంగూలీ అన్నాడు. కోవిడ్–19 వంటి క్లిష్ట సమయంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన గంగూలీ, జై షా ఆటగాళ్ల సంరక్షణ కోసం ఎన్నోచర్యలు చేపట్టారు.
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు ఆగిపోయిన దశలోనూ ‘బయోబబుల్’ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ వంటి టోర్నీలను నిర్వహించారు. 2022లో పదవీకాలం ముగియడంతో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా... గతేడాది వరకు కార్యదర్శిగా కొనసాగిన 36 ఏళ్ల జై షా... 2024 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా నియమితుడయ్యాడు. తద్వారా పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు.
‘2019లో తొలిసారి అతడిని కలిశాను. గుజరాత్ క్రికెట్ సంఘంలో పనిచేసి వచ్చాడు. చిన్నపిల్లవాడిలా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలిచేవాడు. ఏ సమయంలో అయినా సంప్రదించగానే స్పందించేవాడు. అతడికి ఆటపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన ఉంది. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యం అతని ఎదుగుదలకు సహకరించింది. అనుభవంతో మరింత రాటుదేలాడు. ఇప్పుడు క్రికెట్లో అత్యున్నత పదవైన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నాడు. నిజాయితీగా పనులు పూర్తి చేస్తాడు. ఇప్పటికీ అతడితో మంచి అనుబంధం కొనసాగుతోంది’ అని గంగూలీ వివరించాడు.