
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న గవాస్కర్-బోర్డర్ ట్రోఫీ అయిదు టెస్టుల సిరీస్ లో భాగంగా గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ లో అతి కష్టం మీద ఓటమి తప్పించుకున్నరోహిత్ సేన, ప్రతిష్టాంత్మికమైన బాక్సింగ్ డే టెస్ట్ కు ముందు పెను సవాళ్ళని ఎదుర్కుంటోంది. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ మానసికంగా జట్టును కుంగ తీస్తున్న తరుణంలో సిరీస్ మధ్యలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం జట్టును మానసికంగా కుంగదీస్తునడంలో సందేహం లేదు.
రోహిత్ తడ'బ్యాటు'
ఈ సిరీస్ లోని పెర్త్ లో జరిగిన తొలిటెస్ట్ లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసినా, ఆ టెస్టు లో జట్టుకి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించాడు. తన కొడుకు పుట్టిన సందర్భంగా తొలి టెస్ట్ లో పాల్గొనలేక పోయిన రోహిత్ శర్మ, ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడి మొత్తం మూడు ఇన్నింగ్స్ లో 6.33 సగటుతో కేవలం 19 పరుగులు (౩, 6, 10 ) సాధించాడు.
జట్టును ముందుండి నడిపించాల్సిన జట్టు సారధి ఇలాంటి అతిప్రాధాన్యం ఉన్న టెస్ట్ సిరీస్ లో వరసగా విఫలమవడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహంలేదు. మరో పక్క ఆదివారం జరిగిన ప్రాక్టీస్ కు రోహిత్ గాయం కారణంగా దూరంగా ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది.
ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బ్యాండేజ్ వేసుకొని కుర్చీలో కూర్చొని కనిపించడం గమనార్హం. రోహిత్ గాయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేనందున, ప్రస్తుత పరిస్థితిలో రోహిత్ మెల్బోర్న్ లో జరిగే జరిగే నాలుగో టెస్టులో ఆడటంపై ఇంకా స్పష్టత లేదు.
అశ్విన్ రిటైర్మెంట్
అడిలైడ్ లో జరిగిన డే అండ్ నైట్ రెండో టెస్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశించిన రీతిలో రాణించలేక పోయాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లలో 53 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ పడగొట్టిన అశ్విన్ కి బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులో స్థానం లభించలేదు. అతని స్థానం లో వచ్చిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో రాణించి 77 పరుగులు సాధించి, భారత్ కు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించాడు.
తన వ్యూహాత్మకమైన బౌలింగ్ తో భారత్ కి ఎన్నెన్నో ఘన విజయాలు సమకూర్చిన ఘనత వహించిన 38 ఏళ్ళ అశ్విన్ మొత్తం 106 టెస్టుల్లో ప్రాతినిర్ధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకకి చెందిన ముత్తయ్య మురళీధరన్ (800 ), ఆస్ట్రేలియాకి చెందిన షేన్ వార్న్ (708), భారత్ కి చెందిన అనిల్ కుంబ్లే (619) ల తర్వాత, ప్రపంచంలో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ గా ఘనత వహించిన అశ్విన్, ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం, జట్టులోని ఇతర ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తునడంలో సందేహంలేదు.
ప్రధానంగా జట్టులో సీనియర్ ఆటగాళ్ళయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా ఆశించిన స్థాయిలో రాణించనలేకపోతున్న తరుణంలో అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం పలు ప్రశ్నలకు తావిస్తుంది అనడంలో సందేహం లేదు.
బుమ్రా ఒంటరి పోరు
భారత్-ఆస్ట్రేలియా వంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న సిరీస్ లో భారత్ బౌలింగ్ కి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మొత్తం భారం మోయడం బాధాకరం. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో జట్టుకి సారధ్యం వహించిన బుమ్రా, మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో జట్టును విజయాపథంవైపు నడిపించాడు. అయితే, బుమ్రాకి తన సహచర బౌలర్ల నుంచి సరియైన సహకారం లభించడంలేదు.
ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ లేని లోటు భారత జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియా జట్టులో పేస్ బౌలర్లు అందరూ రాణిస్తుండటం ఆ జట్టుకి సమతుల్యాన్ని ఇవ్వడమే గాక భారత్ పై ఆధిక్యాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర వహిస్తోంది.
భారత్ కి ట్రావిస్ 'హెడ్' తలనొప్పి
భారత్ గడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర వహించిన ఆ జట్టులోని ఎడమచేతివాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రస్తుత సిరీస్ లోను భారత్ కి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో విఫలమయినా, తర్వాత విజృంభించి రెండు, మూడు టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించి తన జట్టు బ్యాటింగ్ కి వెన్నుముకగా నిలిచాడు.
భారత్ ఈ సిరీస్ లోని మిగిలిన రెండు టెస్టుల్లో రాణించి ఈ సిరీస్లో విజయం సాధించాలంటే, ట్రావిస్ హెడ్ పరుగుల ప్రవాహానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ గా వ్యూహం రూపొందించాలి. ప్రధానంగా ట్రావిస్ హెడ్ ని నిలవరించ గలిగితేనే ఈ సిరీస్ లో భారత్ కి విజయం దక్కేది.
చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం