పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ | Fans feel for rajat patidar, as the IPL winning captain didnt get a chance in team india | Sakshi
Sakshi News home page

పాపం పాటిదార్‌.. ఆర్సీబీ కెప్టెన్‌పై సానుభూతి వెల్లువ

Jun 6 2026 7:55 PM | Updated on Jun 6 2026 8:16 PM

Fans feel for rajat patidar, as the IPL winning captain didnt get a chance in team india

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించి శ్రేయస్‌కు కొత్త టీ20 కెప్టెన్‌గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది.

యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్‌ జట్టు నుంచి పిలుపందింది. వైభవ్‌ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కింది. తిలక్‌కు మరో జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత 2-3 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హర్షిత్‌ రాణాకు మూడు జట్లలో చోటు లభించింది.

హర్షిత్‌ అంశం ప్రస్తుతం భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026 అత్యుత్తమంగా రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌ను కాదని ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా ఇవ్వని హర్షిత్‌కు ఇన్ని అవకాశాలు ఇవ్వడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నా, జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్న భువీపై సానుభూతి ప్రదర్శిస్తున్నారు.

ఇదే క్రమంలో టీమిండియాకు ఎంపికయ్యే విషయంలో మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఆ ఆటగాడు ఆర్సీబీ సారధి రజత్‌ పాటిదార్‌. పాటిదార్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక అతను వరుసగా రెండు సార్లు ఆర్సీబీకి టైటిల్‌ అందించాడు. 17 సీజన్లలో ఒక్క టైటిల్‌ కూడా సాధించలేని ఆర్సీబీ, పాటిదార్‌ సారథ్యంలో వరుసగా రెండు టైటిళ్లు సాధించడంతో అభిమానుల్లో అతడిపై క్రేజ్‌ను మరింత పెరిగింది.

తాజాగా సీజన్‌లో పాటిదార్‌ కెప్టెన్‌గా సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇరగదీశాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 192.69 స్ట్రయిక్‌రేట్‌తో 41.75 సగటున 501 పరుగులు చేశాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడికైనా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుతుందని అంతా భావిస్తారు. పాటిదార్‌ విషయంలోనూ అదే జరిగింది.

తీరా చూస్తే భారత సెలెక్టర్లు తాజాగా ప్రకటించిన జట్ల విషయంలో అతడి పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం ఐర్లాండ్‌ లాంటి చిన్న జట్టుపై అయినా అవకాశం ఇవ్వాల్సింది. అదీ జరగలేదు. దీంతో పాటిదార్‌పై భువనేశ్వర్‌ కుమార్‌ తరహాలో సానుభూతి వ్యక్తమవుతుంది. పాపం పాటిదార్‌ అంటూ అతని వ్యక్తిగత, ఆర్సీబీ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నారు.

వాస్తవానికి వారి బాధలో అర్దం ఉంది. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టు నిర్మాణాన్ని బట్టి చూస్తే పాటిదార్‌ లాంటి డాషింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఎంతో అవసరం. నాలుగు, ఐదు స్థానాల్లో బరిలోకి దిగి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల దిట్ట అతడు. ఇలాంటి ప్రదర్శనలను అతడి నుంచి ఇటీవలికాలంలో చాలా చూశాం. కాబట్టి సహజంగానే పాటిదార్‌ లాంటి ప్లేయర్‌ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ జట్టులో పరిమిత బెర్త్‌లకు మాత్రమే ఆస్కారం ఉండటంతో పాటిదార్‌కు మొండిచెయ్యి తప్పలేదు.

ఆర్సీబీ అభిమానుల్లో ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టుకు సంబంధించి మరో అసంతృప్తి కూడా ఉంది. ఛాంపియన్‌ జట్టు నుంచి కనీసం ఒక్క ఆటగాడికి కూడా ప్రాతినిథ్యం లభించలేదని వారు బాధపడుతున్నారు. 

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి

ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు
శ్రేయస్‌  అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవి బిష్ణోయి, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ

 

Advertisement
 
Advertisement
Advertisement