
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జూన్ 10) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు విలయతాండవం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేశారు.
ఓపెనర్లు బెన్ డకెట్ (46 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమీ స్మిత్ (26 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ (10 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (22 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేకబ్ బేతెల్ (16 బంతుల్లో 26 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ తొలుత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు ఎవిన్ లెవిస్ 9, జాన్సన్ ఛార్లెస్ 9, షాయ్ హోప్ 45 (27 బంతుల్లో), షిమ్రోన్ హెట్మైర్ 26 (8 బంతుల్లో), రూథర్ఫోర్డ్ 1 పరుగుకు ఔటయ్యాడు.
ఈ దశలో పోరాడితే పోయేదేముందున్నట్లు రెచ్చిపోయిన రోవ్మన్ పావెల్ 45 బంతుల్లో అజేయమైన 79 పరుగులు చేసి విండీస్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అతనికి జేసన్ హోల్డర్ (12 బంతుల్లో 25) జత కలిశాడు. అయినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితమైంది. తద్వారా మ్యాచ్ కోల్పోవడమే కాకుండా, క్లీన్ స్వీప్ పరాభవాన్ని కూడా తప్పించుకోలేకపోయింది.
ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా విండీస్ ఇలాంటి పరాజయాలే ఎదుర్కొంది. దీనికి ముందు విండీస్ ఇదే ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా 0-3 తేడాతో కోల్పోయింది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా హ్యారీ బ్రూక్కు ఇది తొలి అసైన్మెంట్. అరంగేట్రంలోనే రెండు సిరీస్లకు క్లీన్ స్వీప్ చేసిన బ్రూక్.. కెప్టెన్సీ కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు.