ద్రవిడ్‌, కల్లిస్‌ను దాటేసిన రూట్‌.. మిగిలింది పాంటింగ్‌, సచిన్‌ మాత్రమే..! | ENG VS IND 4th Test Day 3: Joe Root Surpasses Dravid And Kallis In Elite List | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test: ద్రవిడ్‌, కల్లిస్‌ను దాటేసిన రూట్‌.. మిగిలింది పాంటింగ్‌, సచిన్‌ మాత్రమే..!

Jul 25 2025 4:29 PM | Updated on Jul 25 2025 4:38 PM

ENG VS IND 4th Test Day 3: Joe Root Surpasses Dravid And Kallis In Elite List

ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌ జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో రాహుల్‌ ద్రవిడ్‌, జాక్‌ కల్లిస్‌ను అధిగమించాడు. 

మాంచెస్టర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లోఈ ఫీట్‌ను నమోదు చేశాడు. మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ద్రవిడ్‌ను.. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కల్లిస్‌ను అధిగమించాడు.

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రూట్‌ ముందుంది రికీ పాంటింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ మాత్రమే. భారత్‌తో జరుగుతున్న ఇదే సిరీస్‌లో రూట్‌ రికీ పాంటింగ్‌ను కూడా అధిగమించే అవకాశం​ ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు ఐదో టెస్ట్‌లో మరో 89 పరుగులు చేస్తే పాంటింగ్‌ను అధిగమిస్తాడు. 

అప్పుడు రూట్‌ ముందు సచిన్‌ మాత్రమే ఉంటాడు. సచిన్‌ రికార్డు బద్దలు కొట్టడం రూట్‌కు అంత ఈజీ కాదు. రూట్‌ తన కెరీర్‌లో మరో 2500 పైచిలుకు పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ ఫీట్‌ అసాధ్యమైతే కాదు. రూట్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే మరో 25 టెస్ట్‌ల్లో సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలవడం ఖాయం.

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 15921
రికీ పాంటింగ్‌- 13378
జో రూట్‌- 13290*
జాక్‌ కల్లిస్‌- 13289
రాహుల్‌ ద్రవిడ్‌- 13288

మ్యాచ్‌ విషయానికొస్తే.. 225/2 స్కోర్‌ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో ఆచితూచి ఆడుతుంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తుండటంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నారు. పోప్‌ 32, రూట్‌ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోర్‌ 261/2గా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడి స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు.  క్రాలే వికెట్‌ జడేజాకు.. డకెట్‌ వికెట్‌ అన్షుల్‌ కంబోజ్‌కు దక్కింది.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement