
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్ 2024 టోర్నీలో పాకిస్తాన్-ఏ జట్టు తొలి విజయం నమోదు చేసింది. అల్ అమీరట్ వేదికగా ఒమన్తో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్లో పాక్-ఏ జట్టు 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఖాసిమ్ అక్రమ్ (48), రొహైల్ నజీర్ (41 నాటౌట్), ఆరాఫత్ మిన్హాస్ (31 నాటౌట్), ఒమైర్ యూసఫ్ (25), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలరల్లో ముజాహిర్ రజా రెండు వికెట్లు పడగొట్టగా.. వసీం అలీ, సమయ్ శ్రీవత్సవ, సుఫ్యాన్ మెహమూద్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఒమన్ను కట్టడి చేశారు. జమాన్ ఖాన్ 2, షానవాజ్ దహాని, మొహమ్మద్ ఇమ్రాన్, ఖాసిమ్ అక్రమ్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు.
ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (28), జతిందర్ సింగ్ (24), హమ్మద్ మిర్జా (14), ఆమిర్ ఖలీమ్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ ఈ టోర్నీలో తమ తదుపరి మ్యాచ్లో యూఏఈతో తలపడనుండగా.. భారత్ ఇవాళ సాయంత్రం అదే యూఏఈని ఢీకొట్టనుంది.