పీఓకే ఉద్యమకారులనుద్దేశించి పాక్ రక్షణమంత్రి వ్యాఖ్య
ఇస్లామాబాద్: మెరుగైన జీవనం, పాలన, అవకాశాలు కోరుతూ ఉద్యమిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉద్యమకారులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఇస్లామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాక్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లంతా భారత్లాగే మాకు బద్ద శత్రువులు. ఉద్యమకారులతో చర్చలకు కూర్చునే ప్రసక్తే లేదు.
వాళ్లంతా పాకిస్తాన్కు విరోధులే’’అని అన్నారు. గత రెండ్రోజుల్లో పాక్ భద్రతా బలగాలు ఏకంగా 37 మంది ఉద్యమకారులను పొట్టనబెట్టుకున్నాయని ఉద్యమసంఘాల కూటమి ‘జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ)’బుధవారం ప్రకటించిన వేళ ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఓవైపు జేఏఏసీ బృందం తమతో చర్చలు జరిపిందని, 38 డిమాండ్లను తమ ఎదుట ఉంచిందని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా ప్రకటించగా అందుకు భిన్నంగా రక్షణమంత్రి మాట్లాడటం గమనార్హం.
పీఓకే శాసనసభ తొలి దశ ఎన్నికలు జరిగిన సోమవారం రోజు రావలకోట్ నుంచి ముజఫరాబాద్కు శాంతియుత ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు కాల్పులు జరిపి చిన్నారులు, మహిళలు సహా 37 మందిని చంపేశారని జేఏఏసీ తెలిపింది. ‘‘ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గతంలో ప్రభుత్వం నుంచి సాయుధ శిక్షణ పొందిన పీఓకే వాసులు ఇప్పుడు ప్రభుత్వం మీదకు తుపాకీ గురిపెట్టారు’’అని ప్రధానమంత్రి సలహాదారు రాణా సనావుల్లా వ్యాఖ్యానించారు.


