ధీరజ్, సురేఖలకు నిరాశ | Disappointment for Dheeraj and Surekha | Sakshi
Sakshi News home page

ధీరజ్, సురేఖలకు నిరాశ

Oct 21 2024 3:10 AM | Updated on Oct 21 2024 3:10 AM

Disappointment for Dheeraj and Surekha

వరల్డ్‌కప్‌ ఆర్చరీ ఫైనల్స్‌ టోర్నీ 

ట్లాక్స్‌కాలా (మెక్సికో): ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ నిరాశపరిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్‌–8 ప్లేయర్లకు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ధీరజ్‌ పురుషుల రికర్వ్‌ విభాగంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్‌ ఫైనల్‌) ఓడిపోయాడు. 

మరోవైపు మహిళల కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ కూడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్‌ ఫైనల్‌) పరాజయం పాలైంది. పురుషుల కాంపౌండ్‌ విభాగంలో భారత ప్లేయర్‌ ప్రథమేశ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్రీ మార్టా పాస్‌ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 145–147 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. 

ప్రథమేశ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన ప్రియాంశ్‌పై 147–146తో గెలిచాడు. సెమీఫైనల్లో ప్రథమేశ్‌ డెన్మార్క్‌ ప్లేయర్‌ మథియాస్‌ ఫులర్టన్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ప్రథమేశ్‌ 146–150తో మైక్‌ ష్లాసెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాడు. రికర్వ్‌ క్వార్టర్‌ ఫైనల్లో ధీరజ్‌ 4–6 (28–28, 29–26, 28–28, 26–30, 28–29)తో లీ వూ సియోక్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement