
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 453.1 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.
డ్యూస్టాడ్ జెనెట్ హెగ్ (నార్వే; 466.9 పాయింట్లు) స్వర్ణం, ఎమిలీ జెగీ (స్విట్జర్లాండ్; 464.8 పాయింట్లు) రజతం సొంతం చేసుకున్నారు. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్కు ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీలలో ఇది ఐదో పతకం కావడం విశేషం.
మరోవైపు గురువారమే జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్కు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్లో అంకుశ్ జాదవ్ (631.7 పాయింట్లు) 11వ స్థానంలో, అర్జున్ బబూటా (629.1 పాయింట్లు) 43వ స్థానంలో, సందీప్ సింగ్ (628.3 పాయింట్లు) 53వ స్థానంలో నిలిచారు.