ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్ మ్యాచ్లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్ మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్ చేతిలో ఓడిపోయాడు. 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.
రెండో సింగిల్స్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్లలో అలెక్స్ లేనియర్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్లో కూడా హెచ్ఎస్ ప్రణయ్ నిలవలేకపోయాడు.
ఈ మ్యాచ్లో టోమా జూనియర్ పొపోవ్ 21–19, 21–16తో ప్రణయ్ను 48 నిమిషాల్లో చిత్తు చేశాడు. సెమీస్లో ఓటమితో భారత్ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్ మ్యాచ్ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్ ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు.


