అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్గన్ షూటింగ్ టోర్నమెంట్ను భారత జట్టు ఏకైక కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వివాన్ కపూర్–నీరూ ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో వివాన్–నీరూ జంట 24 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యాంగ్ కున్ పి–లియు వాన్ యు (చైనీస్ తైపీ) జోడీ 36 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెలిచింది. 33 పాయింట్లతో మౌరో డె ఫిలిపిస్–మరియా స్టాంకో సిల్వానా (ఇటలీ) జంట రజత పతకాన్ని కైవసం చేసుకుంది.


