
గువాహటి: భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన ఒలింపిక్స్ కలను సాకారం చేసుకున్నట్లే మిగతా వారు కూడా ఒలింపియన్లుగా ఎదగాలనే లక్ష్యంతో అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తర గువాహటిలోని బర్చండ్రాలో గురువారం లాంఛనంగా ప్రారంభమైన ఈ అకాడమీలో ఫీజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ వెచ్చించే విధంగా నెలకు కేవలం రూ. 500 చెల్లించి ఇక్కడ ‘పంచ్’లు నేర్చుకోవచ్చు. 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయో విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి కూడా కోచింగ్ ఇస్తారు.
ఆమె లాభాపేక్షలేని కృషిని గుర్తించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రూ. 2 కోట్ల గ్రాంట్ను అందజేయనున్నట్లు ప్రకటించారు. లవ్లీనా తన అకాడమీకి ప్రభుత్వ స్థలాన్ని అడగలేదు. 2021లో సొంతంగా అకాడమీ ఏర్పాటు కోసం స్థలం కొనుగోలు చేసిన ఆమె మెరుగైన మౌలిక సదుపాయాలతో దాన్ని తీర్చిదిద్దింది. 26–26 సైజ్ బాక్సింగ్ రింగ్తో పాటు ఆధునిక పరికరాలతో కూడిన జిమ్ను ఏర్పాటు చేసింది. గువాహటిలో సకల హంగులతో నెలకొల్పిన తొలి బాక్సింగ్ అకాడమీగా చెప్పవచ్చు.
అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల బాలబాలికలు, యువత కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతిభాసక్తులు ఉన్న వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు, ప్రొఫెషనల్ బాక్సర్లుగా తయారయ్యేందుకు ఈ అకాడమీ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా లవ్లీనా పేర్కొంది. కొత్త తరం బాక్సర్లకు ఇదో వేదికగా మారాలని ఆకాంక్షించింది.
‘మేటి బాక్సర్లను తయారు చేయాలనే కలతో దీన్ని నిర్మించాను. ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు తేవాలని, 2028కల్లా కొందరైనా బాక్సర్లు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను’ అని 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా చెప్పింది. దశలవారీగా బాక్సర్లకు హాస్టల్ వసతి కల్పించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని చెప్పింది.