బిహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 14 ఏళ్లకే ట్రిపుల్‌ సెంచరీ | Bihar Produces Another Vaibhav Sooryavanshi To Serve Indian Cricket, Smashes Unbeaten 306 In Bihar U-19 Women’s ODI | Sakshi
Sakshi News home page

బిహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 14 ఏళ్లకే ట్రిపుల్‌ సెంచరీ

Jun 18 2026 9:15 PM | Updated on Jun 19 2026 12:18 PM

Bihar Produces Another Vaibhav Sooryavanshi To Serve Indian Cricket

వైభవ్ సూర్యవంశీ.. బిహార్ నుంచి వచ్చి తన సంచలన బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే బిహార్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం వెలుగులోకి వ‌చ్చింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించింది.

ఈ చిచ్చర పిడుగు పేరు అక్షర గుప్తా. బిహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో అక్షర ఏకంగా అజేయ త్రిశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్‌లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధి బౌలర్లను అక్షర్ ఉతికారేసింది.  కేవలం 126 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 306 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

తొలుత 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. మహిళల దేశీవాళీ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా అక్షర నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా (346) ఉంది. మరో 40 పరుగులు చేసి ఉంటే ఇరా గుప్తా రికార్డును అక్షర బ్రేక్ చేసి ఉండేది.

ఎవరీ అక్షర గుప్తా?
వైభవ్ సూర్యవంశీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అక్షర.. పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఆమె స్పెషాలిటి. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఆమె నాయకత్వం వహించింది. అంతేకాకుండా బిహార్‌ సీనియర్ జట్టుకు కూడా అక్షర్ ప్రాతినిథ్యం వహించింది. అయితే ఫిట్‌నెస్ పరంగా కూడా ఆమె కొంచెం మెరుగు పడాల్సి ఉంది.
చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement