Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి | Sakshi
Sakshi News home page

Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి

Published Wed, Jan 31 2024 9:27 PM

BCCI Secretary Jay Shah Reappointed As ACC Chief - Sakshi

బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్‌ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

32 ఏళ్ల వయసులో తొలిసారి..
కాగా జై షా ఏసీసీ బాస్‌గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్‌ హుసేన్‌ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు.

ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో బాస్‌గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర
ఇక గతేడాది ఆసియా కప్‌-2023 హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్‌కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

పాక్‌ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్‌ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ ఈవెంట్‌ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్‌ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే.

చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్‌కు షాక్‌.. కీలక స్పిన్నర్‌ దూరం

Advertisement
Advertisement