
ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ (Afghanistan vs Bangladesh) జట్లు షార్జా, అబుదాబీ వేదికలుగా మూడు మ్యాచ్ల టీ20, వన్డేల్లో సిరీస్ల్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 2) తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్, రిషద్ చరో 2 వికెట్లు తీయగా.. తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్కు శుభారంభం లభించినా, ఆతర్వాత రషీద్ ఖాన్ (Rashid Khan) (4-0-18-4) తన స్పిన్ మాయాజాలంతో వారిని వణికించాడు. ఓపెనర్లు తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ద సెంచరీలతో రాణించి తొలి వికెట్కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత రషీద్ ధాటికి 8 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.
ఎట్టకేలకు నురుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) బంగ్లాదేశ్ను విజయతీరాలకు చేర్చారు. మరో 8 బంతులు మిగిలుండగా ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). ఈ సిరీస్లో రెండో టీ20 ఇవాళే (అక్టోబర్ 3) జరుగనుంది.
చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్