పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టెస్టు సెంచరీ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులోనూ బాబర్ తీవ్రంగా నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతనికి ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన బాబర్, యంగ్ పేసర్ జోష్ టంగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
అంతకుముందు లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. లార్డ్స్ ఓటమి తర్వాత ఎడ్జ్బాస్టన్ టెస్టు కోసం పాక్ తమ తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. అందులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లే ఉండటం గమనార్హం. ఈ కీలక టెస్టులో బాబర్ సీనియర్ ఆటగాడిగా జట్టును ముందుండి నడిపిస్తాడని పీసీబీ భావించినప్పటికీ, అతడి ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాలేదు.
బాబర్ ఆజం టెస్టు ఫార్మాట్లో మూడంకెల స్కోరును అందుకుని మూడేళ్లకు పైగా అవుతోంది. అతడు చివరిసారిగా డిసెంబర్ 2022లో కరాచీ వేదికగా న్యూజిలాండ్పై సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి బాబర్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ఫామ్ లేమి కారణంగా 2024లో ఇంగ్లండ్తో జరిగిన హోమ్ సిరీస్ మధ్యలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "బాబర్.. ఇకనైనా నువ్వు మారవా?" అంటూ ఓ యూజర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు. "జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్లోకి వస్తాడు" అంటూ మరికొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
చదవండి: ఏషియన్ గేమ్స్.. భారత జట్టులో కీలక మార్పు


