జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్-2026కు ముందు భారత మహిళల జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆమె స్థానంలో ఓపెనర్ ప్రతీకా రావల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.
కాగా భారత మిడిలార్డర్లో కీలక ప్లేయర్ అయిన జెమీమా, 'ది హండ్రెడ్' టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయానికి గురైంది. ఆమె ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేదు. ఈ కారణంగానే దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్కు కూడా జెమీమా దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్లోనూ రోడ్రిగ్స్ స్థానంలో ప్రతీకాకే చోటు దక్కింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లోనూ సత్తాచాటేందుకు ప్రతీకా సిద్దమవుతోంది.
ప్రతీక విషయాన్ని వస్తే.. ఈ ఆసియాకప్లోనే ఆమె థాయిలాండ్పై ఆమె తన టీ20 అరంగేట్రం చేసింది. రావల్ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వస్తుంది. ఈ టోర్నీలో ఇంకా ఆమె తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్లలో 36 పరుగులు చేసింది.
అయితే వన్డేల్లో మాత్రం ఆమెకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే 50 ఓవర్ల క్రికెట్లో భారత్ తరపున ప్రతీకా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లు ఆడింది. ఇంగ్లండ్లో జరిగే వన్డే కప్లో వార్విక్షైర్ తరఫున ఆడేందుకు సిద్దమవుతున్న సమయంలో ప్రతీకాకు భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె తిరిగి టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడింది.
ఆసియా క్రీడల కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్), జి కమలిని (వికెట్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్ శ్రీ చరణి, నందిని శర్మ.
చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం


