పాలావాన్: ఫిలిప్పీన్స్లోని పాలావాన్ ప్రావిన్స్లో పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు కోస్ట్గార్డ్ గురువారం వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘ఎంవీ జూన్ ఆస్టర్’ (M/V June Aster) ఫెర్రీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. పాలావాన్ తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల (1.3 మైళ్ల) దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు కోస్ట్గార్డ్ తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను కోస్ట్గార్డ్ ఫేస్బుక్లో విడుదల చేసింది. అందులో ఫెర్రీ పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 42 మందిని రక్షించినట్లు కోస్ట్గార్డ్ కెప్టెన్ నోమీ కయాబ్యాబ్ స్థానిక రేడియోకు తెలిపారు. వీరిలో 38 మంది ప్రయాణికులు కాగా.. నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే 87 మంది ఆచూకీ తెలియడం లేదని ఆమె చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?


