ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారత హాకీ జట్టుకు గుర్తింపుగా ఉన్న ‘బ్లూ’ జెర్సీని వదిలి ఇటీవల ప్రపంచకప్లో మన టీమ్ కాషాయం రంగు జెర్సీతో బరిలోకి దిగింది. దాంతో ఈ అంశం వివాదాస్పదం కాగా, హాకీ ఇండియా (హెచ్ఐ)లో విభేదాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పుడు మళ్లీ పాత రంగుకే ఓటు వేసింది. ఆసియా క్రీడల్లో మన టీమ్ ఎప్పటిలాగే నీలిరంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ తిర్కీ ఖరారు చేశారు. ‘ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు కిట్ రంగు విషయంలో మా ప్రాధాన్యత వెల్లడించాలని ఒలింపిక్ సంఘం కోరింది.
మేం తొలి ప్రాధాన్యతంగా నీలి రంగును ఎంపిక చేసుకున్నాం. కాషాయం రంగు శాశ్వతం కాదని, మున్ముందు మారవచ్చని వరల్డ్ కప్ సమయంలోనే నేను చెప్పాను. ఇప్పుడు నీలి రంగు మళ్లీ వచ్చింది. భారత హాకీ టీమ్ ‘బ్లూ’తో బరిలోకి దిగుతుంది’ అని తిర్కీ స్పష్టం చేశారు.
వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగిన టర్ఫ్లు నీలి రంగులో ఉండటంతో మన జెర్సీ రంగు కలిసిపోయి ఆటగాళ్లకు ఇబ్బంది అవుతుందని భావిస్తూ రంగు మార్చామంటూ నాడు హెచ్ఐ వివరణ ఇచ్చింది. కానీ దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్ను ఎనిమిదో స్థానంతో ముగించిన భారత జట్టుకు ఆసియా క్రీడలకు కీలకం కానున్నాయి. ఇక్కడి ప్రదర్శనను బట్టి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు జట్టు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది.


