న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) మకావ్ చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం భారత నంబర్వన్ ర్యాంకర్ మనుశ్ షా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... బుధవారం భారత రెండో ర్యాంకర్, ప్రపంచ 47వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ కూడా మొదటి రౌండ్లోనే ఓటమి చవిచూశాడు.
ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో మానవ్ 12–14, 4–11, 11–9, 3–11తో పరాజయం పాలయ్యాడు. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో మానవ్ తన సర్వీస్లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 12 పాయింట్లు సాధించాడు. తొలి రౌండ్లో ఓడిన మానవ్కు 8,000 డాలర్ల (రూ. 7 లక్షల 58 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చాంపియన్స్ లెవెల్ టోర్నీని కేవలం సింగిల్స్ విభాగాల్లోనే నిర్వహిస్తారు.


