న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఒలోముక్ ఫీడర్ లెవెల్ టీటీ టోర్నీలో భారత ప్లేయర్ అంకుర్ భట్టాచార్జీ ‘డబుల్’ ధమాకా సృష్టించాడు. చెక్ రిపబ్లిక్లోని ఒలోముక్ పట్టణంలో జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ 78వ ర్యాంకర్ అంకుర్ పురుషుల సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్ విభాగంలోనూ టైటిల్స్ సాధించాడు. అంకుర్ డబ్ల్యూటీటీ టూర్ కెరీర్లో ఇవే తొలి రెండు టైటిల్స్ కావడం విశేషం. సింగిల్స్ ఫైనల్లో అంకుర్ 9–11, 11–4, 11–5, 11–6తో డెని కొజుల్ (స్లొవేనియా)పై గెలుపొందాడు.
అంకుర్కు 1000 డాలర్ల (రూ. 95 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. డబుల్స్ ఫైనల్లో అంకుర్–ఆకాశ్ పాల్ (భారత్) ద్వయం 11–8, 4–11, 13–11, 11–9తో డేవిడ్ జంటోసి (హంగేరి)–మటెజ్ జలెవ్స్కీ (పోలాండ్) జంటపై విజయం సాధించింది. అంకుర్–ఆకాశ్పాల్లకు 500 డాలర్లు (రూ. 48 వేలు), 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో అంకుర్ రెండు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్స్, రెండు టోర్నీల్లో సెమీఫైనల్స్ చేరుకొని ఐదో టోర్నీలో రెండు టైటిల్స్ సొంతం చేసుకున్నాడు.


