భారత మహిళల ‘ఎ’ జట్టు సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో 0–3తో చిత్తయింది. న్యూ చండీగఢ్ వేదికగా గురువారం జరిగిన మూడో టీ20లో ఆసీస్ మహిళలు 7 పరుగుల తేడాతో భారత్ను ఓడించారు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనిక లియరాయిడ్ (42 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్లు), కర్ట్నీ వెబ్ (42 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు దినేశ్ వృందా (41 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్లు), తేజల్ హస్నబిస్ (24 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడైన ఆటతో తొలి వికెట్కు 46 బంతుల్లోనే 84 పరుగులు జోడించి శుభారంభం అందించారు.
అయితే ఆ తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. టేలా వ్లామెనిక్, లిలీ మిలిస్ చెరో 3 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆదివారం మొదలవుతుంది.


