
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫకర్ జమాన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు) వికెట్ తీసిన అతను.. పాకిస్తాన్తో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా మరింత మెరుగయ్యాడు. హార్దిక్ పాక్తో కేవలం 8 టీ20 ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
హార్దిక్ తర్వాత పాక్పై అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్కు దక్కుతుంది. భువీ 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో హార్దిక్, భువీ తర్వాతి స్థానాల్లో బుమ్రా (7), అర్షదీప్ సింగ్ (7) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జోరు ప్రదర్శిస్తుంది. 11.2 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును తాకింది.
సాహిబ్జాదా ఫర్హాన్ (56) మెరుపు అర్ద సెంచరీతో బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా హుస్సేన్ తలాత్ (6) క్రీజ్లో ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 103/2గా ఉంది. హార్దిక్ ఫకర్ జమాన్ వికెట్ తీయగా.. శివమ్ దూబేకు సైమ్ అయూబ్ (21) వికెట్ దక్కింది.
కాగా, ఈ మ్యాచ్ టాస్ సమయంలో కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ నిరాకరించాడు. ఈ కారణంగా గ్రూప్ దశ మ్యాచ్లో పెద్ద వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ బోర్డు ఈ వివాదానికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చూపుతూ అతన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను ఐసీసీ తోసిపుచ్చి పైక్రాఫ్ట్కు అండగా నిలిచింది. పైగా నేటి మ్యాచ్లో కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా కొనసాగించింది.