భువనేశ్వర్: ఏడాది విరామం తర్వాత మళ్లీ ట్రాక్పై అడుగు పెట్టిన ఆంధ్రప్రదేశ్ స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.99 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో జ్యోతి ఆసియా క్రీడల అర్హత ప్రమాణ సమయం (13.34 సెకన్లు) అధిగమించి ఆసియా క్రీడలకు బెర్త్ను ఖరారు చేసుకుంది. 2022 ఆసియా క్రీడల్లో జ్యోతి రజత పతకం సాధించింది.
వెంకట్రామ్ రెడ్డి కూడా..
మరోవైపు పురుషుల 800 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందిన మొగలి వెంకట్రామ్ రెడ్డి కూడా ఆసియా క్రీడలకు అర్హత సాధించాడు. ఇటీవల ఆసియా అండర్–20 చాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన వెంకట్రామ్రెడ్డి జాతీయ చాంపియన్షిప్లోనూ ఆకట్టుకున్నాడు.
హీట్ రేసును వెంకట్రామ్ రెడ్డి 1 నిమిషం 47.46 సెకన్లలో ముగించి ఫైనల్కు అర్హత పొంది ఆసియా క్రీడల అర్హత ప్రమాణ సమయాన్ని (1ని:48.80 సెకన్లు) అధిగమించాడు.
ఇదిలా ఉంటే.. మహిళల ట్రిపుల్ జంప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మల్లాల అనూష 13.13 మీటర్ల దూరం గెంతి కాంస్యం సాధించింది. అయితే ఆసియా క్రీడల అర్హత ప్రమాణాన్ని (13.34 మీటర్లు) అధిగమించడంలో విఫలమైంది.


