టేక్మాల్(మెదక్): శ్రీనిధి డబ్బుల స్వాహాపై అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని గొల్లగూడెం గ్రామంలోని 8 గ్రూపుల్లో శ్రీనిధి సీబీఎఫ్ నిధులను వీఓఏ ఆంజనేయులు అవినీతి చేశాడని డ్వాక్రా సంఘం సభ్యులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారం గ్రామంలోని గ్రూప్ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించి విచారణ చేపట్టారు. సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎం మాట్లాడుతూ.. గ్రామంలోని మల్లీశ్వరి, మహేశ్వరి గ్రూపుల పేరుపై వచ్చిన రూ.4 లక్షల చొప్పున రూ.8లక్షలను గ్రూప్ సభ్యులు తమకు అవసరం లేదని చెప్పారు. దీంతో గ్రూప్ సభ్యుల పేర్లపై వీఓఏ రూ.8లక్షలు డ్రా చేశాడని, అమౌంట్ తీర్మానం చేసి తీసుకున్నాడా లేదా అనేది ఇంకా విచారణ చేయాలన్నారు. రూ.8లక్షలకు గాను రూ.7 లక్షలు చెల్లించాడని, ఒక లక్ష చెల్లించాలని తెలిపారు. విజయలక్ష్మి గ్రూప్పై రూ.2 లక్షలు తీసి ఒక లక్షను ఇద్దరి సభ్యురాళ్లకు రూ.50 వేల చొప్పున ఇచ్చినట్లు చెప్పారు. ఇంకొక లక్ష ఆంజనేయులు తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తెలిపారు.


