వస్త్రోత్పత్తి రంగంలోని అన్ని వర్గాలతో సమావేశాలు పద్మశాలీ భవనం పూర్తి చేయిస్తాం వైఎస్సార్ అంత్యోదయ కార్డులతో ఆదుకున్నారు సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ
సిరిసిల్ల: సిరిసిల్లలో ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఒకే చోట అమ్ముకునేందుకు వీలుగా నేత బజారును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందుకు వస్త్రోత్పత్తి రంగంలోని అన్ని వర్గాలతో ఈ నెలాఖరులోగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్తో కలిసి పాల్గొన్నారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలను ఉత్పత్తి చేయాలని, కాలానికి అనుగుణంగా వస్త్రోత్పత్తి రంగంలో మార్పులు చేయాలని సూచించారు. పట్టణంలోని పద్మశాలీ సంఘ భవనాన్ని పూర్తి చేస్తామని, కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్సీ)ను ఏర్పాటు చేస్తామన్నారు. నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని, గతేడాది 6.60 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయగా.. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో రెండు విడతల్లో ఆర్డర్లు ఇచ్చామన్నారు. స్కూల్ యూనిపామ్స్, సంక్షేమ శాఖ అర్డర్లు ఇస్తున్నట్లు వివరించారు.
అంత్యోదయ కార్డులతో వైఎస్సార్ ఆకలి తీర్చారు
నేతన్నలు ఆత్మగౌరవంతో జీవించాలని దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ఒకేసారి 13వేలు అంత్యోదయకార్డులను అందించారని, మె డికల్ శిబిరం నిర్వహించి నేతన్నలకు భరోసా కల్పించారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తితో సిరిసిల్ల చీరలకు గు ర్తింపు లభించిందన్నారు. 25 హెచ్పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీనిస్తూ.. రూ.350 కోట్ల బకా యిలను విడుదల చేశామన్నారు. నూలు డిపో ద్వా రా రూ.67 కోట్ల నూలును అరువుపై అందించామ ని, కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్ట్, రూ.5లక్షల బీ మా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
నేతకార్మికులతో ర్యాలీ
కోర్టు నుంచి పాత బస్టాండ్ వద్ద గల నేతన్న విగ్రహం వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, చేనేత, వస్త్రపరిశ్రమ కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో నేత కార్మికులను సన్మానించారు. వస్త్రోత్పత్తిదారులు మగ్గాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు మంజూరు చేయాలని, డయింగ్ యూనిట్లకు స్థలాలు కేటాయించాలని, జౌళిశాఖలో పనిచేసే సీఎఫ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆర్డీవో శ్రీధర్బాబు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సంతోష్, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అడెపు భాస్కర్, చేనేత వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివా స్, వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, బూట్ల నవీ న్, యెల్దండి దేవరాజు, నేత కార్మికులు పాల్గొన్నారు.


