వేములవాడ: వేదాలు హిందూ ధర్మానికి మూలస్తంభాలు. ఆ వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద, శాస్త్ర, స్మార్త, ఆగమ విద్వత్సదస్సులో భాగంగా నిర్వహించిన ‘స్మార్త ప్రవీణ‘ పరీక్షలలో పలువురు చిన్నారులు ప్రతిభచాటారు. పిన్న వయస్సులోనే పెద్ద గళం విప్పి అత్యుత్తమ శ్రేణి (ఉత్తమ గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. గోపన్నగారి శితికంఠశర్మ, గోపన్నగారి వివస్వచ్ఛర్మ, గోపన్నగారి వరరుచి శర్మ, ఉపాధ్యాయుల శ్రీహర్షశర్మలు విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, వేదపాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయశర్మ, వేద పరీక్షాధికారుల చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు.
ఒకే ఇంటి నుంచి..
రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ మాజీ స్థానాచార్యులు, పండితులు గోపన్నగారి శంకరయ్య గారి మనవళ్లు ఈ చిన్నారులు కావడం విశేషం. ఒకే కుటుంబం నుంచి నలుగురు బాల విధ్వాంసులు రూపుదిద్దుకుని జాతీయస్థాయిలో వేద–స్మార్త విద్యలలో విశేష పాండిత్యాన్ని ప్రదర్శించడం పండిత లోకాన్ని ఎంతగానో అలరించింది. తాతగారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని, వేద సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిన్నారులు స్మార్త ప్రవీణ పరీక్షలలోని క్లిష్టమైన ప్రశ్నలకు అత్యంత సులువుగా సమాధానమిచ్చి ప్రశంసలు అందుకున్నారు.
పిన్న వయస్సులోనే పెద్ద గళం
ఒకే ఇంటినుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నలుగురు చిన్నారులు


