● ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: వేములవాడలో పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు వారంలోగా సిద్ధం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. వేములవాడలో భక్తులకు, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఈవో రమాదేవి, స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ, ఆర్అండ్బీ ఎస్ఈ భీమ్లానాయక్, క్షేత్ర ఆర్కిటెక్ట్ తేజ, పర్యాటక శాఖ ఏఈ జీవన్ పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
ఎల్నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడుగుంతలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్వెల్స్ రీచార్జ్ పనులు ముమ్మరంగా చేయించాలని తెలిపారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల పాల్గొన్నారు.


