మార్కాపురం రూరల్: పొలాలకు కంచె వేస్తే పంటలు రక్షితంగా ఉంటాయి.. కానీ ప్రాణాంతక విద్యుత్ కంచె ఏర్పాటు చేస్తే ప్రాణాలే పోతాయి. అక్రమంగా విద్యుత్ సరఫరా చేసి ఏర్పాటు చేసిన కరెంట్ కంచె ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న ఘటన మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పరిధి పడమటిపల్లిలో చోటుచేసుకుంది. పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన రోడ్డ నారమ్మ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
కరెంట్ కంచెతో కాటేసిన మృత్యువు
స్థానికుల కథనం ప్రకారం.. నారుకోట సుబ్బారెడ్డి తన పొలానికి ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసి కంచె ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పొలంలోకి వెళ్లిన నారమ్మ కరెంట్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మృతదేహం మాయం చేసేందుకు యత్నం?
నారమ్మ మృతి విషయం బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహాన్ని సుబ్బారెడ్డి కొంతదూరం తరలించేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల జనాలు గమనించడంతో మృతదేహాన్ని సమీపంలోని చెట్ల పొలంలో వదిలేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారమ్మ కుమార్తె తన తల్లి కోసం పొలం వద్దకు వచ్చి సుబ్బారెడ్డిని ప్రశ్నించగా ‘నారమ్మను చూడలేదు’ అంటూ చెప్పినట్లు సమాచారం. అనంతరం మృతదేహం ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రైతు చెప్పిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం?
మృతురాలి కుమార్తె ప్రశ్నించినా పట్టించుకోని రైతు
రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు


