మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్
సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు
కందుకూరు: స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మెజార్టీ స్థానా ల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమర్థంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. శుక్రవారం స్థానిక పామూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. పైగా చంద్రబాబు వస్తేనే కరువు వస్తుందన్న నానుడి నిజం చేస్తూ ప్రస్తుతం వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు దొరికే పరిస్థితి లేదని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం అన్నీ మరుగనపడి కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలే దీనికి నిదర్శనమన్నారు. కందుకూరు నియోజకవర్గంలోనూ పార్టీ గ్రాఫ్ పెరిగిందని సర్వేలు చెప్తున్నాయని వివరించారు.
కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అన్ని విధానాల దౌర్జన్యాలు, కుట్రలకు అధికార పార్టీ నాయకులు పాల్పడతారని బుర్రా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా నామినేషన్లు వేసేందుకు పత్రాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తారన్నారు. అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొవాలని సూచించారు.
అభ్యర్థులకు అండగా ఉంటా..
పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకమనే విషయాన్ని ఏ ఒక్కరూ విస్మరించరాదన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఇలా ఇన్ని స్థానాల్లోను బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకుల మధ్య ఉండే చిన్ని చిన్న విభేదాలను పక్కన పెట్టి నాయకులందరి సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఆ జాబితాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థులు ప్రకటిస్తామని వివరించారు. కందుకూరు మున్సిపాలిటీలో కూడా పార్టీ విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు అన్ని విధాలా తాను అండగా ఉంటానని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు.
ఐడీ కార్డుల పంపిణీ
పార్టీ అధిష్టానం జారీ చేసిన ఐడీ కార్డులను బుర్రా చేతు ల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ, మండల స్థాయిలో పదువులు ఉన్న ముఖ్య నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, అనుమోలు లక్ష్మీనరసింహం, నోటి వెంకటేశ్వరరెడ్డి, నన్నం పోతురాజు, జిల్లా నాయకులు తోకల కొండయ్య, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, అధికార ప్రతినిధులు ముప్పవరపు కిషోర్, బద్దిపూడి జయరావు, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు నలమోతు చంద్రమౌళి, రావులకొల్లు బ్రహ్మానందం, యరమాల నాగభూషణం, మద్దసాని నవీన్, పాలవల్లి అమర్నాథ్రెడ్డి, సయ్యద్ ఫజిల్, గొర్ల రమేష్, కర్పూరపు అశోక్, కాపులూరి మధుసూదన్, బద్దిపూడి ప్రభాకర్రావు, ఉచ్చులూరి రవీంద్ర, చేవూరి శ్రీనివాసమూర్తి, వెలిచెర్ల ధనకోటేశ్వరరావు, గుత్తా గోపి, మర్లపాటి ఆదాం, వల్లెపు ఏడుకొండలు, కాకు వెంకటస్వామి, తుళ్లూరి ఆదిలక్ష్మి, దేవరకొండ ఆదిలక్ష్మి, కొత్తగొర్ల వసంత, జంపని అనూరాధ పాల్గొన్నారు.
సమర్థ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపాలి
సమన్వయంతో పనిచేస్తే గెలుపు ఈజీ
వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్


