దర్శి: షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని చందలూరు సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. త్రిపుర సుందరీపురం గ్రామానికి చెందిన మద్దిరాల శివకృష్ణారెడ్డి తన కారులో దొనకొండ నుంచి దర్శి వస్తున్నారు. అందులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి తొలుత బానెట్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే కారు పక్కకు ఆపి ఆరుగురు కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణాల్లో కారు కాలిపోయింది.
కంభం: పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని మార్కాపురం ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా సూచించారు. ఈ నెల 15న పట్టణంలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేసారు. గ్రామోత్సవం రోజు డీజేలకు అనుమతి ఇవ్వాల ని అధికారులను పలువురు కోరారు. పట్టణం నుంచి కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చే విగ్రహాలను బస్టాండ్ మీద చెరువు కట్టకు నిమజ్జనానికి తరలిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని మాజీ ఉప సర్పంచ్ సయ్యద్ ఖాసిం చెప్పారు. అనంతరం ఓఎస్డీ మాట్లాడుతూ ఒక్క కంభంలో మాత్రమే కాదని, మార్కాపురం, ఒంగోలు జిల్లాల వ్యాప్తంగా గ్రామోత్సవం రోజు డీజేలకు అనుమతుల ఇవ్వకూడదని ఎస్పీ ఆదేశించినట్లు చెప్పారు.


