ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’మీకోసం’ ద్వారా ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి ప్రాధాన్యమిచ్చి, వేగవంతంగా, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ పి.వెంకట రమణలతో ఎస్డీసీ మాధురి, ఈడీ బీసీ కార్పొరేషన్ వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 246 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతుల పట్ల అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల తమ స్థాయిలో పరిష్కరించలేని పరిస్థితి ఉంటే, దానికి స్పష్టమైన కారణాలను అర్జీదారులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ సర్వేలో ప్రజల నుంచి అత్యుత్తమ సానుకూల అభిప్రాయం లభించేలా అధికారులు చురుగ్గా పనిచేయాలని, రీ–ఓపెన్ అయ్యే అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. శాఖాపరంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల అమలును నిరంతరం పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.


