చీమకుర్తి: బస్సు ఢీకొని బైకుపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చీమకుర్తి మెయిన్రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి మండలం కొర్లమడుగు గ్రామానికి చెందిన గోరోజీ రాజాలు (45)ను కొన్ని సంవత్సరాలుగా చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెంలో నివాసం ఉంటున్నాడు. చీమకుర్తిలోని మసీదు సెంటర్లో మెయిన్రోడ్డు మీదుగా పడమర వైపున్న బైపాస్ దగ్గరకు బైకుపై వెళ్తున్న సమయంలో మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజాలు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని సీఐ డీ ప్రసాద్ పరిశీలించారు. మృతుని కుమారుడు ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
మార్కాపురం టౌన్: ఆన్లైన్ చెల్లింపుల పేరుతో ఓ కేటుగాడు మహిళను మోసం చేసిన ఘటన మార్కాపురంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని సత్యనారాయణస్వామి గుడి వీధిలో ఉన్న ఓ కూల్డ్రింక్ షాపు వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి, షాపు నిర్వాహకురాలికి రూ.40 వేలు ఫోన్పే చేస్తానని నమ్మబలికాడు. అనంతరం నగదు పంపినట్లుగా తన ఫోన్లోని ఫేక్ మెసేజ్ను ఆమెకు చూపించాడు. అది నిజమని నమ్మిన నిర్వాహకురాలు సదరు వ్యక్తికి రూ.40 వేల నగదు చేతికిచ్చింది. కాసేపటికి తన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి లబోదిబోమంది.
● పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం తరలింపు
● రాజ్కుమార్ మృతదేహం కోసం
జల్లెడ పడుతున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో గత శనివారం ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కటకానిపల్లెకు చెందిన ఇద్దరు యువకులలో వినయ్కుమార్ అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో వినయ్కుమార్ మృతదేహం 19వ కిలోమీటర్ వద్ద కనిపించి మళ్లీ మునిగిపోయిన విషయం విధితమే. సోమవారం మధ్యాహ్నం సుంకేసుల వద్ద చిల్లచెట్లలో చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో యువకుడు రాజ్కుమార్ మృతదేహం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.


