జె.పంగులూరు: దివ్యతేజ లాకప్ డెత్పై సమగ్ర విచారణ జరిపించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రేణింగవరం పోలీస్స్టేషన్ ఎదుట ఆదివారం దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దివ్యతేజ శవం ఉన్న కొండమూరు సమీపంలో చప్టా ఉన్న ప్రాంతాన్ని సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం రేణింగవరం పోలీస్స్టేషన్ వద్దకు సమాచారానికి వెళ్లగా స్టేషన్లో ఎస్సై అందుబాటులో లేరని, లేడి కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ దళితుడైన దివ్యతేజను చంపి శవాన్ని మాయం చేసిన సంఘటనలో ఎస్సైని అరెస్టు చేయక పోగా కనీసం సస్పెండ్ కూడా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దివ్యతేజ, శశికాంత్ సెల్ ఫోన్ దొంగతనం చేశారనే అరోపణతో కేసు నమోదు చేసిన రేణింగవరం ఎస్సై విచారణ చేయడంతో దివ్యతేజ చనిపోయాడన్నారు. శశికాంత్ ఎక్కడ ఈ విషయం చెబుతాడో అని భయపెట్టి అతన్ని వదిలేశారన్నారు. ఒక దళితుడిని సెల్ఫోన్ దొంగతనం కేసులో లాకప్డెత్ చేయడం అమానుషమన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులే బరితెగించి శవాన్ని మాయం చేసిన కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. కేసు విచారణ గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి స్వయంగా విచారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, దేవరపల్లి గోపి, ఎర్రమల శ్రీను, మురళి తదితరులు ఉన్నారు.


