కురిచేడు: పశువులను కాసేందుకు వెళ్లి వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎన్ఎస్పీ అగ్రహారంలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కేసనపల్లి ఏలియా(45) పశువులను మేపేందుకు ప్రతిరోజు లాగానే ఆదివారం వెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తనతో పాటు పశువులను మేపుకుంటున్న తాటి అంజమ్మతో తన పశువులను చూస్తుండాలని, తాను మంచినీరు తాగి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఇంటికి వచ్చి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. దీంతో రాత్రి సమయంలో పొలం వద్దకు వెళ్లి చూడగా రాత్రి వరకు వాగులో ఓ నీటి కుంట వద్ద ఏలియా మృతి చెంది పడి ఉన్నట్లు తెలిపారు. ఏలియాకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఏలియా ఎలా మృతి చెందాడో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


