మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో 2026 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల కార్యక్రమాన్ని ఆదివారం మార్కాపురంలో నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉత్తమ విద్యా ప్రమాణాల సాధనకు, పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న 210 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యం.వి.రామచంద్రరెడ్డి హాజరై మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడి కృషి ఒక్క విద్యార్థి జీవితాన్నే కాకుండా, భవిష్యత్ సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.రమణారెడ్డి, అపుస్మా రీజినల్ ప్రెసిడెంట్ ఎ.వి.సుబ్బారావు తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు. మార్కాపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి పెద్దసంఖ్యలో పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అపుస్మా అధ్యక్షుడు జి.మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి పి.సుధీర్ కుమార్ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, గౌరవాధ్యక్షుడు జి.సుబ్బరత్నం (బాబురావు) తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


