ఒంగోలు టౌన్: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గురువులిచ్చే సలహాలు, సూచనలను ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. సమాజంలో విజయం సాధించిన ప్రతిఒక్కరి వెనుక ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ లీప్ యాప్ ద్వారా విద్యార్థుల ప్రతిభను నిత్యం గమనిస్తుండాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను నిశితంగా గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రకాశం జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యాతాయుతంగా పనిచేయాలని టీచర్లకు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో విదేశాలకు వెళ్లాలని కోరిక ఉండేదని, దానికంటే ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వస్తుందని గురువులు చెప్పిన మాటలే తనను కలెక్టర్ను చేశాయని గుర్తు చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అఽధికారి సీవీ రేణుక అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో 72 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో పండుగ వాతావరణం నెలకొంది. గురుపూజోత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గురుదేవోభవ అంటూ చిన్నారులు ఆలపించిన గేయాలు పులకింపజేశాయి. కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారులు రవి, రంగయ్య, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం


