కంభం: భాషా బోధనతో పాటు సాహిత్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న హజరత్గూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తెలుగు ఉపాధ్యాయురాలిగా సరోజ కేవలం పాఠ్యపుస్తకాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. తెలుగు పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు, ప్రసంగాలు, పద్యపఠనం వంటి అంశాలను ఆసక్తికరంగా బోధిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. అష్టావధానం, కవితా పఠనం, వ్యాసరచన, కథారచన, ప్రసంగం, సాహిత్య చర్చలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. గతంలో పనిచేసిన ఎల్.కోట పాఠశాలలో సుమారు రూ.లక్ష సొంత నిధులను వెచ్చించి తెలుగు సాహిత్య నిలయాన్ని ఏర్పాటు చేయడం సరోజ సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. అందులో ప్రముఖ తెలుగు కవుల చిత్రాలు, వ్యాకరణ అంశాలు, పద్యాలు, ఇతర సాహిత్య సమాచారాన్ని అందుబాటులో ఉంచి విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేశారు. సొంత నిధులతో పాటు దాతల సహకారంతో హజరత్గూడెం పాఠశాలలో అదనపు గది, భోజనశాల, గ్రంథాలయం వంటి సదుపాయాల ఏర్పాటుకు కృషి చేశారు.


