ఒంగోలు సబర్బన్: జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా సీహెచ్ రాజశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో ఈఈగా పనిచేస్తున్న రాజశేఖర్ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేసుకున్న అనంతరం జిల్లా ఈఈగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని పరిస్థితులు, పర్యావరణానికి సబంధించిన అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అసిస్టెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అనలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: ప్రభుత్వ వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ డి.ఏడుకొండలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రభుత్వ వైద్యులు గురువారం స్థానిక జీజీహెచ్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ 2016 జనవరి 1 నుంచి యూజీసీ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. డీపీహెచ్, డీఎస్హెచ్ వైద్యులకు డైనమిక్ సీఏఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలని, నాన్ క్లినికల్ విభాగంలోని ఎంఎస్సీ అర్హత కలిగిన వారిని నియమించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ వైద్యుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. వైద్యులకు న్యాయం, వైద్య వ్యవస్థ బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్యం అనే లక్ష్యంతో తామంతా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు తిరుపతిరెడ్డి, నటరాజ్, వెంకటేశ్వరరావు, మస్తాన్బాషా, రంజిత్ బాషా, రాజమ్మ, చంద్రకళ, శ్రీలత, రామస్వామి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: పీజీ కోర్సులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, సిలబస్, కోర్సుల నిర్మాణం, క్రెడిట్స్, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, తదితర అంశాలపై సభ్యులు సమగ్రంగా చర్చించి ఉత్తమ పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని స్థానిక ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ) వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి ఆదేశించారు. ఏకేయూలో పీజీ కోర్సులపై గురువారం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. ఈట అమృతవల్లిదేవి ప్రారంభోపన్యాసం చేయగా, ముఖ్యఅతిథిగా వీసీ ప్రొఫెసర్ మూర్తి పాల్గొని మాట్లాడారు. అనంతరం విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఉన్నత విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పీజీ కోర్సుల సిలబస్ రూపొందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. సభాధ్యక్షుడు, విద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ రాజమోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా దృక్పథం, నైపుణ్యాభివృద్ధి పెంపొందించే విధంగా కోర్సులను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు సభ్యులు పలు విలువైన సూచనలు చేసి ఉన్నత పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ మండే హర్షప్రీతం దేవ్కుమార్, పలు విభాగాల అధ్యాపకులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సీడీసీ డీన్ ప్రొఫెసర్ కేవీఎన్ రాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ సోమశేఖర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ భారతీదేవి, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, సోషల్ వర్క్ హెచ్ఓడీ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


