మార్కాపురం రూరల్: సైన్యంలో పనిచేసిన క్రమశిక్షణ.. ఉపాధ్యాయుడిగా విద్యార్థులపై బాధ్యత.. పాఠశాల అభివృద్ధిపై అంకితభావం.. ఇవన్నీ కలిసి బోడపాడు ఎంపీపీ పాఠశాల రూపురేఖలే మార్చేశాయి. పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు పి.శ్రీనివాసులుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. మార్కాపురం జిల్లా నుంచి సెకండ్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు గతంలో ఆర్మీలో సేవలందించి రిటైరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి 2024లో బోడపాడు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఎస్జీటీగా విధుల్లో చేరారు. సైన్యంలో పనిచేసిన సమయంలో అలవర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావాన్ని ఉపాధ్యాయ వృత్తిలోనూ కొనసాగించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.


