ఒంగోలు సబర్బన్: పని చేయించుకొని జీతాలు ఇవ్వకుంటే ఏ విధంగా బతకాలని గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి జీతాలు లేకుండా పనిచేయించుకోవడం న్యాయమేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు దాదాపు కొన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. ఈ మేరకు బుధవారం ప్రకాశం భవన్ ముందు బుధవారం గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు. రెండేళ్లుగా జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకున్నారని, జీతం లేకుండా కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు కురిచేడు, బి. నిడమనూరులో 13 నెలలు, కల్లూరులో 24 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే కార్మికుల కుటుంబాలు ఎలా బతకాలని అన్నారు. నిత్యం పరిసరాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆహర్నిశలు పాటుపడుతున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అన్ స్కిల్డ్, డైలీ లేబర్కు నిర్ణయించిన కనీస వేతనం రూ.708 ఎక్కడ అమలుకావటంలేదన్నారు. ఇస్తున్న అతి తక్కువ వేతనాలు 24 నెలల వేతనబకాయిలు ఉంటే వారు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ –వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పి. శ్రీనావాసరావు, జిల్లా ట్రెజరర్ ఎన్. ఏలిషా, కె. శివాజీ, తిరిపాల్, ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ప్రకాశం భవనం ముందు
గ్రామ పంచాయతీ కార్మికులు,
గ్రీన్ అంబాసిడర్ల ఆందోళన
మద్దతు ప్రకటించిన సీఐటీయూ నాయకులు


