● డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ధ్వజం
ఒంగోలు టౌన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ.పిచ్చయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం నిర్వహించిన డీవైఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ హయాంలో నీట్ పేపర్ లీకేజీతో పాటు పలు రాష్ట్రాల్లో పరీక్ష పత్రాల లీకేజీలు జరుగుతున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యువజన సంఘం జిల్లా కార్యదర్శి కె.ఎఫ్. బాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో నిరుద్యోగ సమస్యలపైనే ప్రధానంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు టి.సురేష్, కె.వంశీధర్, సీహెచ్. మోహన్, జి.శ్రీకాంత్, కె.రాణి, కార్తీక్, మురళి, దినేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.
డీవైఎఫ్ఐ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు పిచ్చయ్య


