● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
ఒంగోలు సిటీ: ఇటీవల సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్(వైఎస్సార్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం రమణారెడ్డి, వై.కె.ప్రసాద్, ఉపాధ్యక్షుడు టి.బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇన్–సర్వీసు ఉపాధ్యాయులు టెట్ పరీక్షపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం టెట్ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయ నేతలు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యను విన్నవించేందుకు వెళ్లిన వారిపై సస్పెన్షన్ విధించడం సరికాదన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో పునరాలోచించి సస్పెన్షన్ను ఎత్తివేయాలని, అలాగే ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రకటించిన టెట్ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు.
● బ్యాంకర్లకు ఇన్చార్జ్ జేసీ రమణ ఆదేశం
ఒంగోలు సబర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ పి.వి.రమణ బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలో మంగళవారం ఇన్చార్జి జేసీ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.28,335 కోట్ల రుణ పంపిణీ లక్ష్యం కాగా, మొదటి త్రైమాసికంలో రూ.8,961 కోట్లను(31.63 శాతం) అర్హులకు అందించినట్లు ఎల్డీఎం రమేష్ వివరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జేసీ మాట్లాడుతూ.. అర్హులైన పశుపోషకులు, మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని, పీఎంఎఫ్ఎంఈ రుణాలను సత్వరం అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్న నిధులను బ్యాంకులు రుణ రికవరీల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేసుకోకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్బీఐ లీడ్ బ్యాంక్ ఆఫీసర్ యలమందరెడ్డి, నాబార్డ్ డీడీఎం రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డీఆర్డీఏ–మెప్మా పీడీ నారాయణ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా హౌసింగ్ అధికారి శ్రీనివాస ప్రసాద్, రూడ్సెట్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డితో పాటు విద్యుత్, ఉద్యానవన, చేనేత జౌళి శాఖల అధికారులు పాల్గొన్నారు.


