సాక్షి,వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జనసేన నాయకుడు పంతం నానాజీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పంతం నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారంలో ఉన్నామనే అహంకారంతో కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం ఏంటో నానాజీకి తెలియాలంటే ఢిల్లీలోని పెద్దలను అడగాలి. ఒంటరిగా పోరాడి, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద వ్యవస్థలను సైతం ఎదుర్కొన్న చరిత్ర జగన్ది. అక్కడ కూడా తెలియకపోతే, స్వయంగా మీ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అడిగితే జగన్ దమ్ము గురించి స్పష్టంగా చెప్తారు’అని ఎద్దేవా చేశారు.
కేవలం అధికార బలం చూసుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని కూటమి నాయకులకు హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు స్థాయి మరిచి మాట్లాడే సంస్కృతిని మానుకోవాలని స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన భయపడేది లేదని, భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తాము కేవలం మాటలతో సరిపెట్టబోమని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చేతల్లోనే చర్యలు ఉంటాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.


