సాక్షి, తాడేపల్లి: డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా 'గురు పరిరక్షణ దీక్ష' పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్, పెన్మెత్స సురేష్ బాబు, ఇసాక్, కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్కుమార్, రామచంద్రారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పాలవలస విక్రాంత్, సిపాయి సుబ్రహ్మణ్యం నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?: వైవీ
వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది. అర్హులుగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించమని మేము అడగడం లేదు. అనర్హులను మాత్రమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేస్తే అనర్హులు బయటపడతారు’’ అని ఆయన పేర్కొన్నారు.
విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?: కురసాల
మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అనర్హులు గురువులు అయితే విద్యార్థుల నష్టపోతారు. విద్యావ్యవస్థలో నకిలీ గురువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నకిలీ గురువులతో భావితరాలు నష్టపోతాయి.. ఈ డీఎస్సీ ప్రక్రియ దుర్మార్గమైన స్కామ్. స్కామ్ బయటపడినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?. కూటమి సర్కార్కి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. అన్ని వర్గాలకు ప్రభుత్వం నష్టం చేసింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు


