సాక్షి, తాడేపల్లి: అమెరికాలోని డల్లాస్లో రాష్ట్ర మంత్రి ఒకరు తనను వేధించారంటూ ‘ప్యూర్’ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) సంస్థ వ్యవస్థాపకురాలు, ఎన్ఆర్ఐ డాక్టర్ శైలా తాళ్లూరి మంత్రి నారా లోకేష్కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు వెన్నుపోటు పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఆక్షేపించారు.
ఎన్ఆర్ఐ అయిన తెలుగు మహిళను వేధించిన ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని, వారు అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా మహిళలపై వేధింపులు, దాడులు, అవమానాలు పెరిగిపోయాయని చెప్పారు. మహిళలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి గుర్తు చేశారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే..
అమెరికాలోని డల్లాస్లో వెన్నుపోటు పార్టీకి చెందిన ఓ మంత్రి తనను వేధించారంటూ ఎన్ఆర్ఐ తెలుగు మహిళ సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసినా, ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దం పడుతోంది. ఆ మహిళను ఒంటరిగా కాఫీకి రావాలని పిలవడం, ఫొటోలు పంపి ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలను సైతం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం అత్యంత హేయం.
ఇంత జరిగినా వెన్నుపోటు పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, హోం మంత్రి అనిత తదితరులని ట్యాగ్ చేస్తూ న్యాయం కోసం అభ్యర్థించినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం స్పందించక పోవడం హేయం.
రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగిన ప్రతిసారీ తిరిగి బాధితుల పైనే కేసులు పెట్టే పరిస్థితిని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా కమిషన్, హోం శాఖ, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రజల కోసం కాకుండా అధికార వెన్నుపోటు పార్టీ నాయకుల కోసం మాత్రమే పని చేస్తున్నాయనే భావన కలుగుతోంది.
వెన్నుపోటు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు అవి సరిహద్దులు కూడా దాటాయి. చివరకు అమెరికాలో సైతం ఏకంగా రాష్ట్ర మంత్రి, ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించడం వెన్నుపోటు పార్టీ, ఈ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వానికి ఏ మాత్రమైనా నైతికత ఉంటే, తక్షణమే ఆ మంత్రిని బర్తరఫ్ చేసి, కేసు పెట్టి విచారణ చేయాలని నాగ మల్లీశ్వరి డిమాండ్ చేశారు.


