సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders Complain In Police Commissionerate About Illegal Cases And Arrests, More Details Inside | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు: వైఎస్సార్‌సీపీ

Nov 7 2024 9:34 PM | Updated on Nov 8 2024 12:52 PM

Ysrcp Leaders Complain In Police Commissionerate About Illegal Cases

ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులపై పోలీస్ కమిషనరేట్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్.. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు.. డీసీపీకి వినతిపత్రం అందించారు.

కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది: దేవినేని అవినాష్
ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు సరిగాలేదు. నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో 150 మందికి నోటీసులిచ్చారు. అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలకు మేం అండగా ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేం తోడుగా ఉంటాం.

తక్షణమే అక్రమ కేసులు, దాడులు ఆపాలి: వెల్లంపల్లి శ్రీనివాస్‌
ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి.. అరెస్టులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదని అక్రమంగా కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులను ప్రోత్సహించొద్దని పోలీసులను కోరుతున్నాం. కేసుల పేరుతో పూటకో స్టేషన్ మార్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను అణచివేస్తే తిరగబడే రోజు కచ్చితంగా వస్తుంది

అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా: మల్లాది విష్ణు
ప్రతిపక్షం గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ అనేక అబద్ధపు ప్రచారాలు చేసింది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి విజయవాడలో కేసులు పెడుతున్నారు. 90 మంది మహిళలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తప్పా. ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం తప్పా. కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే ఛలో అసెంబ్లీ చేపడతాం. హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?

కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌: దొడ్డా అంజిరెడ్డి
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. తిరువూరులో ఇద్దరు విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. దివ్యాంగులను కూడా వదలడం లేదు. సోషల్ మీడియా సైనికులను కేసులతో భయపెట్టలేరు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం తప్పిదాలను ఎండగడతాం

Advertisement
 
Advertisement
Advertisement